పరశురామ జయంతి ఎప్పుడు.. ఈ రోజు ఇలా పూజ చేస్తే ఎంత పుణ్యమో!

 

పరశురామ జయంతి ఎప్పుడు.. ఈ రోజు ఇలా పూజ చేస్తే ఎంత పుణ్యమో!

పరశురాముడు  విష్ణుమూర్తి  ఆరవ అవతారం.  భూమండలం మీద క్షత్రియులను 21సార్లు ఊచకోత కోసి క్షత్రియుల నుండి ఈ భూమండలాన్ని ఋషులకు అప్పగించిన మహావీరుడు.  పరశురాముడు వైశాఖ శుద్ద తదియ రోజు జన్మించాడు.  ఈ తిథినే అక్షయ తృతీయగా పిలవబడుతోంది.  ఈ రోజున భక్తులు భక్తిశ్రద్ధలతో పరశురాముడిని పూజించి, ఉపవాసం కూడా ఉంటారు. పరశురామ జయంతి  రోజు  పూజ చేయడం వల్ల జీవితంలో ఆనందం, శాంతి , శ్రేయస్సు లభిస్తాయని నమ్ముతారు. పరశురాముడు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినప్పటికీ, ధర్మాన్ని రక్షించడానికి అధర్మానికి, అన్యాయానికి వ్యతిరేకంగా ఆయుధాలు చేపట్టాడు. అందువల్ల, ఆయనను మతరీత్యా బ్రాహ్మణుడిగా, చేతలరీత్యా క్షత్రియుడిగా పరిగణిస్తారు. ధర్మాన్ని రక్షించడానికి సరైన సమయంలో ధైర్యం , బలం అవసరమని ఆయన జీవితం  బోధిస్తుంది. పరశురాముడిని ఎలా పూజించాలి? తెలుసుకుంటే..

పరశురామ జయంతిని ఎందుకు జరుపుకుంటారు?

వైశాఖ మాసంలోని శుక్ల పక్షం మూడవ రోజు ప్రదోష కాలంలో పరశురాముడు జన్మించాడు. అందువల్ల ఈ తిథి ప్రదోష కాలంలో వచ్చిన రోజున పరశురామ జయంతిని జరుపుకోవడం మరింత శుభప్రదంగా భావిస్తారు. దీని ఆధారంగా, ఈ సంవత్సరం పరశురామ జయంతిని ఏప్రిల్ 19వ తేదీన జరుపుకోవాలని నిర్ణయించారు. హిందూ పురాణ నమ్మకాల  ప్రకారం పరశురాముడిని స్మరించుకోవడం ధైర్యాన్ని, బలాన్ని , ధర్మ మార్గాన్ని ప్రేరేపిస్తుంది. అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడటమే నిజమైన ధర్మం అనే సందేశాన్ని ఆయన జీవితం తెలియజేస్తుంది.

పరశురాముడికి గొడ్డలి ఎవరు ఇచ్చారు?

పరశురాముడు జమదగ్ని మహర్షి కుమారుడు.  ఆయన శివుని గొప్ప భక్తుడిగా , శిష్యుడిగా పరిగణించబడతాడు. పరశురాముని ప్రగాఢ భక్తి, తపస్సు , సామర్థ్యాలకు సంతోషించిన శివుడు, అతనికి పరశు అనే దివ్య ఆయుధాన్ని ప్రసాదించాడు. ఈ దివ్య గొడ్డలిని విద్యుద్భి అని కూడా పిలుస్తారని అంటారు. దీనిని శివుడు పరశురామునికి ఇచ్చాడు. పరశురాముడు ఈ గొడ్డలిని ఎల్లప్పుడూ తనతోనే ఉంచుకునేవాడు, అందువల్లనే ఆయన పరశురాముడిగా ప్రసిద్ధి చెందాడు. ఆయన జీవితం ధర్మం, శక్తి , న్యాయానికి ప్రతీకగా పరిగణించబడుతుంది,  ఈ గొడ్డలి ఆయన ధైర్యానికి, కర్తవ్య నిష్ఠకు చిహ్నంగా నిలిచింది.

పరశురాముని పూజ..

పరశురామ జయంతి నాడు  భక్తిశ్రద్ధలతో పరశురాముడిని పూజిస్తారు. ఈ రోజున ఉదయాన్నే నిద్రలేచి, స్నానం చేసి, పూజ చేయాలని సంకల్పం చేసుకోవాలి. ప్రశాంతమైన మనస్సుతో భగవంతుని పూజకు సిద్ధమవ్వాలి.


ఇంట్లో లేదా గుడిలో శుభ్రమైన ప్రదేశంలో పరశురాముని విగ్రహాన్ని లేదా చిత్రాన్ని ప్రతిష్ఠిస్తారు.  పరశురామునికి తిలక ధారణతో  పూజ ప్రారంభమవుతుంది. దీని తరువాత అక్షింతలు, పువ్వులు, తులసి ఆకులను సమర్పిస్తూ ఆరాధిస్తారు.

పూజ సమయంలో పరశురాముని  మంత్రాలను పఠిస్తారు.  విష్ణువు మూర్తి  అవతారమే పరశురాముడు కాబట్టి విష్ణుమూర్తిని స్తుతించడం,  విష్ణుసహస్రనామాల పారాయణ చేయడం చాలా మంచిది.  తరువాత నైవేద్యం సమర్పించి,  హారతి ఇవ్వాలి. ఇలా పరశురామ పూజను చాలా సులువుగా చేసుకోవచ్చు.

పరశురామ జయంతి, అక్షయ తృతీయ రెండూ ఈ తిథి రోజే కాబట్టి దానధర్మాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అవసరమైన వారికి ఆహారం, దుస్తులు లేదా ఇతర నిత్యావసర వస్తువులను దానం చేయడం అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది,

                             *రూపశ్రీ.